Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంహుజూర్నగర్‌లో భారీ జాబ్ మేళా ఏర్పాట్లు – మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి యువతకు ఉపాధి అవకాశాలే...

హుజూర్నగర్‌లో భారీ జాబ్ మేళా ఏర్పాట్లు – మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం – తెలంగాణ ప్రభుత్వ దృఢసంకల్పం

డైనమిక్,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 21

తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో దృఢసంకల్పంతో ముందుకు సాగుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుజూర్నగర్ పట్టణంలోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 25న జరగనున్న జాబ్ మేళా ఏర్పాట్లను మంగళవారం మంత్రి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేసి, ఇప్పటికే 70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేసిందని, ప్రైవేట్‌ రంగంలో కూడా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని తెలిపారు.“నిరుద్యోగం సమాజంలో పెద్ద సవాల్‌గా మారింది. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు అమ్మి చదివిస్తున్నారు. కానీ వారికి తగిన ఉద్యోగాలు రాకపోవడం బాధాకరం. అందుకే ఈ జాబ్ మేళా ద్వారా ఉపాధి మార్గాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం,” అని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు.డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ (DEET), సింగరేణి కాలరీస్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు ఇప్పటికే 205 కంపెనీలు, 9,500 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని వివరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిశ్రమలు కూడా పాల్గొనేలా వ్యక్తిగతంగా ఆహ్వానాలు పంపినట్టు మంత్రి తెలిపారు.జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్‌ సదుపాయం కల్పించడమే కాకుండా, పార్కింగ్‌, రిజిస్ట్రేషన్‌ కౌంటర్లు, కంపెనీ స్టాల్స్‌, భోజన ఏర్పాట్ల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్థానిక నాయకులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.మేళాను విజయవంతం చేయడానికి ఉమ్మడి జిల్లాలో పేపర్‌ ప్రకటనలు, పాంప్లెట్లు, వాల్‌పోస్టర్లు, బస్సుల ప్రచారం ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నామని మంత్రి తెలిపారు.“ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలాయి. నిర్వాహకులు మరింత శ్రద్ధ పెట్టి ఎక్కువ కంపెనీలను ఆహ్వానించాలి. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి,” అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, డీట్‌ ప్రతినిధి వంశీ, సింగరేణి ప్రతినిధి చందర్, ఆర్డీవోలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments