Monday, March 2, 2026
Homeతాజా సమాచారంగురుకుల విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన అవసరం జిల్లా ఎస్పీ నరసింహా

గురుకుల విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన అవసరం జిల్లా ఎస్పీ నరసింహా

డైనమిక్,సూర్యాపేట బ్యూరో,నవంబర్6

సూర్యాపేట రూరల్ పరిధిలోని బాలెంల గ్రామ శివారులో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా సైబర్ మోసాలు, సోషల్ మీడియా ప్రభావం, లక్ష్యాలు–విజయాలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

వ్యక్తిగత క్రమశిక్షణ, నిరంతర సాధనతోనే విజయం

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే మంచి ఆలోచనలకు పునాది వేయాలని, వ్యక్తిగత క్రమశిక్షణతో జీవనాన్ని నిర్మించుకోవాలని సూచించారు. ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే నిరంతర కృషి, సాధన అవసరమని చెప్పారు. విజయం సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని, తల్లిదండ్రులకు ఆసరాగా ఉండి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

సైబర్ మోసాలకు జాగ్రత్త

సైబర్ మోసాలు నేటి సమాజంలో అత్యంత ప్రమాదకరంగా మారాయని ఎస్పీ నరసింహ తెలిపారు. ఆన్లైన్ వ్యాపారాలు, సోషల్ మీడియా లింకులు, నకిలీ కాల్స్ పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. “డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మొద్దు. ఎస్బీఐ, సీఐడీ, సీబీఐ పేర్లు చెబుతూ మోసగాళ్లు భయపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాంటి కాల్స్‌ను వెంటనే పోలీసులకు తెలియజేయాలి” అని సూచించారు.

సోషల్ మీడియా వినియోగం జాగ్రత్తగా చేయాలి

మొబైల్, ఇంటర్నెట్ వనరులను జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవాలని, కానీ సోషల్ మీడియా ప్రభావానికి లోనుకావద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలపై అవగాహన కలిగి, ఇతరులను అప్రమత్తం చేయాలని విద్యార్థులను ‘సైబర్ వారియర్స్’గా మారమని పిలుపునిచ్చారు.

డ్రగ్స్‌ నుండి దూరంగా ఉండాలి

యువత డ్రగ్స్ బారిన పడితే భవిష్యత్తు నాశనం అవుతుందని, మంచి స్నేహితులను ఎంచుకుని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదగాలని సూచించారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతమైన జీవితాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.

పాటలతో సామాజిక అవగాహన

ఈ సందర్భంగా పోలీసు కళాబృందం సభ్యులు సామాజిక సమస్యలు, రుగ్మతలు, భద్రత వంటి అంశాలపై పాటల రూపంలో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఆత్మకూరు ఎస్సై శ్రీకాంత్, రూరల్ ఎస్సై వెంకట్రాములు, షీ టీమ్స్ ఎస్సై నీలిమ, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments