కారం పూడి, డైనమిక్,నవంబర్13
మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గురువారం కారంపూడి పట్టణంలోని ఎస్సీ కాలనీలో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు.
సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడే భవనం
ఈ కమ్యూనిటీ హాల్ స్థానిక ప్రజలకు వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే వేదికగా ఉపయోగ పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వసతులు, ప్రజా సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
“ప్రజల సౌకర్యమే మా లక్ష్యం” – జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ప్రజల అభ్యర్థన మేరకు ఈ హాల్ నిర్మాణానికి 15 లక్షల రూపాయల నిధులు కేటాయించామని, అత్యుత్తమ నాణ్యతతో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు.ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు.
ప్రజల సంతోషం వ్యక్తం
ఎమ్మెల్యే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం తమ ప్రాంత అభివృద్ధిలో ముఖ్యమైన ముందడుగు అని అభిప్రాయపడ్డారు.
హాజరైన వారు
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సురేష్ యాదవ్, కూటమి నేతలు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
