డైనమిక్ న్యూస్, మాసాయిపేట్, ఏప్రిల్ 10
మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆధ్వర్యంలో వ్యవసాయ, అనుబంధ శాఖల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖతో పాటు పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవన శాఖల అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు.
పంటల వివిధీకరణపై దృష్టి
వ్యవసాయ శాఖ ప్రగతిని సమీక్షిస్తూ కలెక్టర్ మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పంటల వివిధీకరణ (Crop Diversification) అత్యంత కీలకమని పేర్కొన్నారు. వరి వంటి సంప్రదాయ పంటలపై మాత్రమే ఆధారపడకుండా పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పండ్ల పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. దీని ద్వారా అధిక లాభాలు సాధించవచ్చని తెలిపారు.
పంటల మార్పిడి, నీటి వినియోగంపై సూచనలు
పంటల మార్పిడి (Crop Rotation), నీటి వినియోగంలో మితవ్యత, నేల ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాల ద్వారా రైతులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
పశుసంవర్ధక శాఖకు కీలక ఆదేశాలు
పశుసంవర్ధక శాఖపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ గాలి కుంట వ్యాధి నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశువైద్య మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమాలను సమయానికి పూర్తి చేయాలని తెలిపారు.
మత్స్య రంగ అభివృద్ధిపై దృష్టి
జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు చేపల పెంపకం, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇంకా సంఘాలు లేని గ్రామాల్లో కొత్తగా రిజిస్ట్రేషన్లు చేపట్టాలని సూచించారు. మత్స్యకార మహిళలకు చేపల వంటకాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.
పామాయిల్ సాగుకు ప్రోత్సాహం
ఉద్యానవన శాఖ ద్వారా రైతులను పామాయిల్ పంట సాగు వైపు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు లక్ష్యాలు సాధించాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో పాల్గొన్న అధికారులు
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, మత్స్య శాఖ అధికారి మల్లేశం, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, ఎల్డిఎం బాపూజీ తదితరులు పాల్గొన్నారు.
