సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్, జనవరి 30
ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాప్రయత్నం కేసుకు సంబంధించి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పోలీసులపై, కేసుపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఆయన సూచించారు.
నవంబర్ 18న హత్యాప్రయత్నం కేసు నమోదు
నవంబర్ 18వ తేదీన బాధితుడు జటంగి రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో హత్యాప్రయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తూ బాధితుడి వాంగ్మూలం ఆధారంగా ముగ్గురు వ్యక్తులను ప్రాధమిక నిందితులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
ముగ్గురు నిందితుల గుర్తింపు
ఈ కేసులో ఆత్మకూరు మండలం పాతర్లపాడ్ గ్రామానికి చెందిన
A1 జటంగి సురేష్
A2 బండపల్లి విఘ్నేష్
A3 మహేందర్
అనే వారిని నిందితులుగా గుర్తించామని తెలిపారు.
A2 అరెస్ట్.. A1, A3 పరారీ
నిందితుడు A2 బండపల్లి విఘ్నేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. కాగా A1 జటంగి సురేష్, A3 మహేందర్ పరారీలో ఉన్నారని వెల్లడించారు.
A1పై ఇప్పటికే రౌడీషీట్
పరారీలో ఉన్న A1 జటంగి సురేష్పై గతంలోనే ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదై ఉన్నదని తెలిపారు.
హైకోర్టులో పిటిషన్ కొట్టివేత
తనపై తప్పుడు కేసు పెట్టారని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ A1 హైకోర్టును ఆశ్రయించగా, గౌరవ హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసిందని సీఐ రాజశేఖర్ తెలిపారు.
అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు
హత్యాప్రయత్నం కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో A1 నిందితుడు సోషల్ మీడియాలో కేసుకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరిస్తూ, పోలీసుల ప్రతిష్టను కించపరిచేలా పోస్టులు పెడుతున్నాడని అన్నారు. ఇలాంటి పోస్టులు చేసే వారిపై, వాటిని షేర్ చేసే వారిపైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

