సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్,ఏప్రిల్ 9
ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన కోసం ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.
రెడ్ రన్ ర్యాలీ ప్రారంభం
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో నాలుగో రోజు సందర్భంగా “AIDS అవగాహన నివారణ దినం”లో భాగంగా నిర్వహించిన రెడ్ రన్ ర్యాలీని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల వరకు కొనసాగింది.ర్యాలీ సందర్భంగా “ఎయిడ్స్పై అవగాహన – జీవన రక్షణ”, “సురక్షిత జీవితం – ఆరోగ్య భవిష్యత్తు” వంటి నినాదాలతో ప్రజలకు సందేశాలు అందించారు. బ్యానర్లు, పాంప్లెట్ల ద్వారా వ్యాధి నివారణ మార్గాలను వివరించారు.
హెచ్ఐవీపై అవగాహన కీలకం
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి మార్గాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని అన్నారు. రక్త మార్పిడి, సూదులు/సిరంజీలు వినియోగం, తల్లి నుండి శిశువుకు సంక్రమణ వంటి అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు తప్పనిసరిగా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.
వైద్య శాఖ చర్యలు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెండెం వెంకట రమణ మాట్లాడుతూ, అసురక్షిత లైంగిక సంబంధాల ద్వారా హెచ్ఐవీ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, నిరోధ్ వినియోగం అవసరమని తెలిపారు. సూర్యాపేట, హుజూర్నగర్ సబ్ జైళ్లలో ఖైదీలకు ART, HIV, హెపటైటిస్-బి, టిబి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.అదేవిధంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించగా, 52 మందికి పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసినట్లు తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, వైస్ చైర్మన్ ఎండి షఫీ ఉల్లా, జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్వో డా. చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు, వైద్య సిబ్బంది, వార్డ్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
