నల్లగొండ బ్యూరో, జనవరి 28, డైనమిక్ న్యూస్
నల్లగొండ జిల్లాలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు–2026ను పురస్కరించుకుని నల్లగొండ మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా, పారదర్శకంగా సాగేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష
నామినేషన్లు దాఖలు చేసే విధానం, అభ్యర్థుల ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, క్యూలైన్ల ఏర్పాటు, పోలీస్ బందోబస్త్, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలని అధికారులకు సూచించారు.
నిషేధాజ్ఞలు – అనుమతిలేని గుంపులకు నో ఎంట్రీ
నామినేషన్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ తెలిపారు. అనుమతి లేకుండా గుంపులుగా చేరడం, నినాదాలు చేయడం, జెండాలు–బ్యానర్లు ప్రదర్శించడం, ర్యాలీలు నిర్వహించడం వంటి చర్యలు నిషిద్ధమని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా, ప్రత్యేక గస్తీ బృందాలు, అవసరమైతే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.
సహకరించాలని పిలుపు
నామినేషన్ ప్రక్రియ మొత్తం భయరహిత వాతావరణంలో, శాంతియుతంగా జరిగేలా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీస్ శాఖకు సహకరించి ఎన్నికల నియమాలను గౌరవించాలని కోరారు.ఈ పరిశీలన కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బీ సీఐ రాము, 2 టౌన్ ఎస్ఐ సైదులు తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
