డైనమిక్,నల్లగొండ బ్యూరో, నవంబర్ 1
తిరిగి వర్ష సూచనల నేపథ్యంలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో కప్పి ఉంచాలని, సరైన తేమశాతం వచ్చిన వెంటనే మిల్లులకు తరలించాలని ఆమె సూచించారు.
తిప్పర్తి మండలంలో ఆకస్మిక తనిఖీ
శనివారం కలెక్టర్ త్రిపాఠి తిప్పర్తి మండలం చిన్న సూరారం గ్రామంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ధాన్యం తేమశాతం, కొనుగోలు ప్రక్రియ, రైతుల సమస్యలను సమీక్షించారు.రైతులతో మాట్లాడిన కలెక్టర్ మాట్లాడుతూ “వర్షం మళ్లీ పడే అవకాశాలు ఉన్నందున ధాన్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేయకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపాలి,” అని సూచించారు.
కేతేపల్లి మండల కేంద్రాల పరిశీలన
తదుపరి ఆమె కేతేపల్లి మండలం, ఇనుపాముల మరియు కొత్తపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సుడిగాలి పర్యటనలో పరిశీలించారు.ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం లేని సమయంలో ఆరబెట్టి సరైన తేమశాతం వచ్చిన వెంటనే తూకం వేసి మిల్లులకు పంపాలని ఆదేశించారు.వర్షం వస్తే టార్పాలిన్లు సిద్ధంగా ఉంచి ధాన్యాన్ని కప్పాలని సూచిస్తూ, హమాలీలు, లారీలు ముందుగానే సిద్ధంగా ఉంచాలని తెలిపారు.
సదుపాయాలపై సూచనలు
ఇనుపాములలో పిఎసిఎస్ కేంద్రంలో లారీలకు ర్యాంపు ఏర్పాటు చేయాలని, కొత్తపేటలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న కేంద్రానికి ప్రభుత్వ స్థలం పరిశీలించాలన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
పాల్గొన్న అధికారులు
డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్, డీసీఓ పత్యా నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.


కలెక్టర్ హెచ్చరిక
“తిరిగి వర్ష సూచన ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలి.ధాన్యం తడవకుండా కప్పి ఉంచి, సరైన తేమశాతం వచ్చిన వెంటనే మిల్లులకు తరలించాలి.”
