సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 30
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు.సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.తదుపరి మునగాల, నడిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్ల ఎన్నికల నిమిత్తం నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆదివారం కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెన్ పహాడ్, చివ్వేంల, మోతే, మునగాల, నడిగూడెం, కోదాడ, చిలుకూరు, అనంతగిరి మండలాల్లోని 181 గ్రామపంచాయతీలు, 1,628 వార్డు సభ్యుల కోసం నేటి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు 49 నామినేషన్ కేంద్రాల్లో రెండో విడత నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారని పేర్కొన్నారు.జిల్లాలో ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో సహకరించాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, ఎంపిడిఓలు బాలకృష్ణ, రమేష్ దీన్దయాల్, మాల్సూర్ నాయక్, ఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు.
