సూర్యాపేట బ్యూరో , డైనమిక్ న్యూస్ నవంబర్ 27
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.
నామినేషన్ కేంద్రాల పరిశీలన
గురువారం నూతనకల్ మండల కేంద్రంలోని ఎం.ఆర్.సి భవనం, మిర్యాల గ్రామ పంచాయతీ కార్యాలయం, ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూరు గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
గ్రామాల వారీగా నామినేషన్ స్వీకరణ
నూతనకల్ ఎం.ఆర్.సి భవనంలో నూతనకల్, వెంకేపల్లి, యడవల్లి, చిల్పకుంట్ల గ్రామ పంచాయతీల సర్పంచ్లు మరియు వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.మిర్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో మిర్యాల, అల్గునూరు, లింగంపల్లి, మాచనపల్లి గ్రామాలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తున్నారని చెప్పారు.ఏపూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏపూరు, ఏపూరు తండా, బొప్పారం, కాశిగూడెం, మక్తక కొత్తగూడెం, రామన్నగూడెం, మిడ్తనపల్లి గ్రామాలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు జరుగుతున్నట్లు వివరించారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఇవ్వాలని, వాహనాలను కేంద్రాల నుండి 100 మీటర్ల దూరంలోనే నిలిపివేయాలని కలెక్టర్ సూచించారు.
హెల్ప్ డెస్క్ ఏర్పాటు
అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.గ్రామాల వారీగా స్వీకరించిన నామినేషన్ పత్రాలను వేరువేరుగా భద్రపరచాలని ఆదేశించారు.
అధికారులు హాజరు
ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట డి.ఎస్.పి ప్రసన్న కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓలు సునీత, మహ్మద్ హసీం, ఆర్ఓలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
