అమరావతి, నవంబర్ 7 , డైనమిక్
మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా భారత్కు గౌరవం తీసుకువచ్చిన తెలుగమ్మాయి చరణి కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ ప్రోత్సాహకం ప్రకటించారు. క్రీడా రంగంలో ఆమె ప్రతిభకు సూచకంగా రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, కడపలో 1000 చ.గ. స్థలాన్ని ఇల్లు నిర్మాణం కోసం కేటాయించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని సీఎం ప్రకటించారు.
క్యాంపు కార్యాలయంలో సీఎం, మంత్రిని కలిసిన చరణి
శుక్రవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లను చరణి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పుష్ప గుచ్ఛం అందించి ఆమెకు స్వాగతం పలికారు.ఉమెన్ వరల్డ్ కప్ విజయం సందర్భంగా ఎదురైన ఆనంద క్షణాలను శ్రీ చరణి సీఎంతో పంచుకున్నారు. తమకు ప్రభుత్వం నుండి లభిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
“మహిళా క్రీడాకారిణుల సత్తా చాటారు” – సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ,“ఉమెన్ వరల్డ్ కప్ విజయం భారత మహిళల సత్తాను ప్రపంచానికి చాటింది.చరణి ప్రదర్శన అన్ని యువతీ యువకులకు స్ఫూర్తిదాయకం.
భవిష్యత్లో భారత జట్టుకు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
చరణి మహిళా క్రికెట్ జట్టు సభ్యుల సంతకాలు చేసిన టీషర్ట్ను సీఎంకు అందించారు.దానిని ఆప్యాయంగా స్వీకరించిన సీఎం ఆమెను మరోసారి అభినందించారు.
మిథాలీ రాజ్, కేశినేని చిన్ని తదితరుల హాజరు
చరణితో పాటు భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్,ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్,శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు కూడా సీఎం చంద్రబాబును కలిశారు. ఇంతకు ముందు గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి చరణికి ఘన స్వాగతం పలికారు.తరువాత ఆమె బృందంతో కలిసి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
