Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంపదవ తరగతి విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో 70% మార్కులు సాధించేలా సిద్ధం కావాలి : కలెక్టర్...

పదవ తరగతి విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో 70% మార్కులు సాధించేలా సిద్ధం కావాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 19

పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు రోజువారీ చదువుతో పాటు నిరంతర ప్రాక్టీస్‌ చేసి, ప్రతి సబ్జెక్టులో కనీసం 70 శాతం మార్కులు తెచ్చేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు.మంగళవారం పెన్‌పహాడ్ మండలం అనంతారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, పదవ తరగతి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్ పాఠాలను చదివించడంతో పాటు నోట్‌బుక్స్‌ను పరిశీలించారు.

చదువు ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించిన కలెక్టర్

విద్యార్థులతో మాట్లాడిన ఆయన, “పదవ తరగతి జీవితంలో తొలి మెట్టు. మంచి మార్కులు సాధిస్తే ఇంటర్‌లో కోరుకున్న కళాశాలలో సీటు సాధించడం సులభమే కాదు, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి” అని చెప్పారు.పరీక్షల పట్ల భయం అవసరం లేదని, రోజూ బోధించిన పాఠాలను అదే రోజు సాయంత్రం మరోసారి పునర్విమర్శ చేస్తే మంచి ఫలితాలు సాధించగలమని సూచించారు.“ఒక అంశంపై స్పష్టమైన అవగాహన ఉంటే భయం అనే మాట ఉండదు. ఆత్మవిశ్వాసంతో చదివితే అనుకున్న ఫలితం సాధ్యం” అని ఆయన ప్రేరేపించారు.

అదనపు క్లాసులను సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులు అదనపు తరగతులను పూర్తిగా వినియోగించుకోవాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు.వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.

జీవితానికి లక్ష్యం అవసరం

“జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ లక్ష్యం సాధన కోసం నిరంతర శ్రమ చేయాలి” అని కలెక్టర్ విద్యార్థులకు సందేశం ఇచ్చారు.ఈ సందర్శనలో తహసీల్దార్ లాలు నాయక్, ఎంపిడిఓ జానయ్య, ఎంఈఓ రవి, ప్రధానోపాధ్యాయుడు రవీందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments