కారం పూడి, డైనమిక్, నవంబర్ 15
కారంపూడి పల్నాటి చారిత్రక ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఎస్పీ కృష్ణరావులను పల్నాడు పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ్ శనివారం నరసరావుపేటలో మర్యాద పూర్వకంగా కలుసుకొని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పీఠం నిర్వాహకులు బొగ్గరం విజయ్కుమార్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు ఆహ్వాన పత్రాల అందజేత
పీఠాధిపతితో కలిసి కారంపూడి తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్, ఎంపీడిఓ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి కాసిన్య నాయక్, గ్రామపెద్దలు కలెక్టర్, ఎస్పీలకు ఉత్సవాల ఆహ్వానపత్రాలు అందజేశారు.
ఉత్సవాల తేదీలు – కార్యక్రమాలు
పల్నాటి ఉత్సవాలు ఈ నెల 19 నుండి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి. రోజువారీ కార్యక్రమాలు ఇవి:
1వ రోజు: రాచగవు,2వ రోజు: రాయబారం,3వ రోజు: మందపోరు,4వ రోజు: కోడిపోరు,5వ రోజు: కల్లిపాడు,మూడవ రోజు జరిగే మందపోరు – చాపకుడు కార్యక్రమం అలనాటి బ్రహ్మనాయుడు కాలాన్ని ప్రతిబింబిస్తూ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని పీఠాధిపతి వివరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం ప్రతీ ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.
పోలీస్ శాఖ పూర్తి భద్రతా చర్యలు – ఎస్పీ కృష్ణరావు
పల్నాటి ఉత్సవాలకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతామని జిల్లా ఎస్పీ కృష్ణరావు భరోసా ఇచ్చారు. పల్నాటి వీరుల ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీసు శాఖ సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు.
