డైనమిక్ న్యూస్, నేరేడు చర్ల, ఫిబ్రవరి 3
నేరేడు చర్ల మండల పరిధిలోని జానలదిన్న గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తి పెంపు, పశువుల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా అవగాహనతో కూడిన వైద్య శిబిరం నిర్వహించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డా. జె. నరేష్ , డాక్టర్ రవి నాయక్ పాల్గొని రైతులకు విలువైన సూచనలు చేశారు.
పాడి పరిశ్రమ ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు
ఈ సందర్భంగా డా. నరేష్ మాట్లాడుతూ, గ్రామీణ రైతులకు పాడి పరిశ్రమ స్థిర ఆదాయ వనరుగా మారుతుందని పేర్కొన్నారు. గేదెలు, ఆవుల సంరక్షణలో సరైన పోషకాహారం, శుభ్రత, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో కీలకమన్నారు. పాల ఉత్పత్తి పెంపుకు ఆధునిక పద్ధతులను అవలంబించాలని రైతులకు సూచించారు.
గర్భకోశ వ్యాధులపై ప్రత్యేక అవగాహన
గేదెల్లో సాధారణంగా వచ్చే గర్భకోశ సంబంధిత వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యలపై రైతులకు వివరించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప పశువైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే పశువుల ఉత్పాదకత తగ్గడంతో పాటు ఆర్థిక నష్టం వాటిల్లుతుందన్నారు.
నూతన పశు ట్రీవిస్ (పశువుల బొను) ప్రారంభం
గ్రామంలో పశువుల చికిత్సలు సులభంగా నిర్వహించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ట్రీవిస్ (పశువుల బొను) ను ప్రారంభించారు. దీనివల్ల టీకాలు, చిన్న శస్త్రచికిత్సలు, పరీక్షలు మరింత సులభంగా నిర్వహించవచ్చని అధికారులు తెలిపారు.
గ్రామ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గజ్జీ సరిత కొండల్, ఉప సర్పంచ్ చడా కృష్ణా రెడ్డి, గ్రామ శాఖ గుండెబోయిన లింగమల్లు, రమణ బట్టర్, కుసుమ సోమిరెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
వైద్య బృందం వివరాలు
గోపాల మిత్రలు ఎం. రామయ్య, జి. భాస్కర్, భుజంగరావు, సాయికృష్ణ సేవలందించారు. ప్రథమ చికిత్స కార్యకర్తగా వంశీ కృష్ణ పాల్గొన్నారు.
రైతుల నుంచి సానుకూల స్పందన
ఇలాంటి అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తే పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుందని, తమ ఆదాయం పెరుగుతుందని రైతులు అభిప్రాయపడ్డారు. పశుసంవర్ధక శాఖ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులు అభినందించారు.
