నేరేడుచర్ల, మార్చి 12 (డైనమిక్ న్యూస్):
నేరేడుచర్ల మండలంలో ఏపీఓగా పనిచేస్తున్న అధికారి విధుల వ్యవహారం ప్రస్తుతం మండలవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ బదిలీ నిబంధనల ప్రకారం అధికారులు ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం కొనసాగకుండా మార్పులు చేయాల్సి ఉన్నప్పటికీ, ఈ అధికారి మాత్రం ఏళ్ల తరబడి ఇదే మండలంలో కొనసాగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పదేళ్లకు పైగా ఒకే మండలంలో కొనసాగింపు
ఇక్కడ ప్రస్తుతం పని చేస్తున్న అధికారి గతంలో 2010 నుండి 2018 వరకు నేరేడుచర్ల మండలంలో ఏపీఓగా పనిచేశారు. అనంతరం కొంతకాలం మునగాల మండలంలో పని చేసి తర్వాత 2023లో మళ్లీ ఇదే మండలానికి బదిలీ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నారు. మొత్తంగా చూస్తే దాదాపు పదేళ్లకు పైగా ఒకే మండలంతో ఆయన అనుబంధం కొనసాగడం గమనార్హంగా మారింది.సాధారణంగా అధికారులను ఒకే ప్రాంతంలో ఎక్కువకాలం కొనసాగించకుండా బదిలీలు చేయడం పరిపాలనలో పారదర్శకత కోసం కీలకంగా భావిస్తారు. అయితే ఇక్కడ మాత్రం ఆ నిబంధనలు అమలు అవుతున్నాయా లేదా అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
బంధువుపై ఏసీబీ దాడులు… కొత్త అనుమానాలు
ఇటీవల ఈ అధికారికి సన్నిహిత బంధువుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు జరగడం కూడా మండలంలో చర్చకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒకే ప్రాంతంలో దీర్ఘకాలం కొనసాగుతున్న అంశం మరింత వివాదాస్పదంగా మారింది.
దర్గా దావత్లపై గతంలో ఫిర్యాదులు?
మండలంలో గతంలో నేరేడుచర్ల–పాలకవీడు ఉమ్మడి మండలంగా ఉన్న సమయంలో ప్రతి శుక్రవారం స్థానిక దర్గా వద్ద దావత్లు నిర్వహించేవారని, ఈ వ్యవహారంపై పలువురు అధికారులు వద్దకు ఫిర్యాదులు వెళ్లినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న విషయంపై స్పష్టత లేకపోవడం కూడా ప్రశ్నలకు తావిస్తోంది.
రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కుమ్మక్కు ఆరోపణలు ?
మరోవైపు ఈ అధికారి కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కలిసి అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వసూలు చేస్తున్నారని కూడా మండలంలో పలువూరు విమర్శలు ఆరోపిస్తున్నారు. అధికారిక విధులకు హాజరై రిజిస్టర్లో సంతకం చేసి “ఫీల్డ్ వర్క్” పేరుతో బయటకు వెళ్లి వ్యక్తిగత వ్యాపారం చూసుకుంటున్నారని ఆయన సొంత శాఖలోని కొందరు సిబ్బందే గుస గుసలు గా ప్రచారం జరుగుతోంది.
పక్క మండలంలో నివాసం… ఇదే మండలంలో విధులు
చాలా మంది ఉద్యోగులు తమ విధుల కోసం 30 నుండి 50 కిలోమీటర్ల దూర ప్రాంతాలకు ప్రయాణిస్తుండగా, ఈ అధికారి మాత్రం కూత వేటు దూరంలో నే పక్క మండలం గరిడేపల్లిలో నివాసం ఉంటూ నేరేడుచర్లలో విధులు నిర్వహిస్తున్నారని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
మండలంలో ‘ప్రభావ వలయం’?
ఏళ్ల తరబడి ఇదే మండలంలో కొనసాగడం వల్ల స్థానిక అధికారులతో సాన్నిహిత్యం పెంచుకుని ప్రభావ వలయాన్ని ఏర్పరచుకున్నారని కూడా మండలంలో చర్చ జరుగుతోంది. దీంతో “ఆడిందే ఆట… పాడిందే పాట” అన్నట్టుగా వ్యవహారం సాగుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా కలెక్టర్ జోక్యం అవసరం
ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ దృష్టి సారించి పూర్తి స్థాయి విచారణ జరపాలని మండల ప్రజలు కోరుతున్నారు. బదిలీ నిబంధనలు పాటించ బడుతున్నాయా లేదా అన్న అంశంపై స్పష్టత తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్
పరిపాలనలో పారదర్శకతను కాపాడేందుకు దీర్ఘకాలంగా ఒకే మండలంలో కొనసాగుతున్న అధికారుల పదవీకాలాన్ని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక వర్గాలు కోరుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తారా లేదా అన్నది ఇప్పుడు మండలంలో చర్చనీయాంశంగా మారింది.
ఏపీ ఓ శేఖర్ వివరణ:
ఉమ్మడి మండలం గా ఉన్నప్పుడు నుండీ 8సం రాలు పని చేశాను. అలాగే 2023 నుండి ఇక్కడే పని చేస్తున్నట్లు తెలిపారు. నేను అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం లేదు అని తెలిపారు
