ఎపి పాలిటిక్స్,బ్యూరో
అక్టోబర్ 27 నుంచి ఏపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మొదలుపెట్టనుంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.2025-26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రైస్ మిల్లర్లకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అందరినీ కలుపుకుని పోతున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన రూ.1674 కోట్లు బకాయిలు చెల్లించామని.. రైస్ మిల్లర్లకు చెల్లించాల్సిన763 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు.గతేడాది 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. ఈ ఏడాది 2025-26 ఖరీఫ్ సీజన్లో 51 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మరోవైపు వాట్సప్ ద్వారా ధాన్యం అమ్మకాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నామన్నారు. వాట్సప్లో హాయ్ అని పంపగానే కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే వారి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోందని గుర్తు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు.మరోవైపు గతేడాది అనుభవాలతో తేమ శాతం కొలిచే యంత్రాలు, గన్నీ బ్యాగులు, రవాణా సదుపాయాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ రైస్ మిల్లర్లకు సూచించారు. అక్టోబర్ 27 నుంచి.. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సీజన్లో 3013 రైతు సేవా కేంద్రాలు, 2061 పీపీసీ ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటుగా మొత్తం 10,700 సిబ్బందితో ధాన్యం సేకరణ చేపట్టనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈ సందర్భంగా ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధాన్యం సేకరణ వివరించారు.
