సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్,ఏప్రిల్ 9
రబీ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ కె. సీతారామరావు అధికారులను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల పరిశీలన
గురువారం చివ్వేంల మండలంలోని రాంకోటి తండా, సూర్యాపేట మండలంలోని రాయినిగూడెంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పరిస్థితులను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడారు.
వెంటనే కొనుగోలు – మిల్లులకు తరలింపు
ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రస్తుతం తేమ శాతం, తాలు, తరుగు వంటి సమస్యలు లేకపోవడంతో ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయాలని అన్నారు.
రైతులకు సౌకర్యాలు కల్పించాలి
హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని, రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఓపిఎంఎస్లో నమోదు చేసి త్వరగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించి రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పరికరాలు సక్రమంగా పనిచేయాలి
తేమ శాతం కొలిచే పరికరాలు, బరువు చూసే యంత్రాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని సూచించారు.
పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో చివ్వేంల తహసిల్దార్ చంద్రశేఖర్, సూర్యాపేట తహసిల్దార్ కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
