డైనమిక్,సూర్యాపేట బ్యూరో
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనే స్థాయిలో బోధన జరగాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు.శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మండల విద్యాధికారులు (ఎంఈఓలు), హెడ్మాస్టర్లు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లతో కలెక్టర్ విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
విద్యార్థుల ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఈ నెల 24 నుండి జరగనున్న సమ్మేటివ్ పరీక్షలపై పూర్తి దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. అవసరమైతే అదనపు తరగతులు నిర్వహించి విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఆదేశించారు.
వార్షిక పరీక్షలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నందున వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు.ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు కనీసం 70 శాతం కంటే తగ్గకూడదని హెచ్చరించారు.
ఉపాధ్యాయులు పనిపై పూర్తిగా ఫోకస్ చేయాలి
ఉపాధ్యాయులు బోధనపై పూర్తి దృష్టి పెట్టి, పని పూర్తయ్యే వరకు విశ్రాంతి తీసుకోకూడదని కలెక్టర్ అన్నారు.ఎంఈఓలు మండల స్థాయిలో సమీక్షలు నిర్వహించి, విద్యార్థుల హాజరు తక్కువగా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.ఫీడ్బ్యాక్ ఆధారంగా యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.
రివ్యూలు, ప్రత్యేక కార్యక్రమాలు తప్పనిసరి
“రేపటి క్లాసులపై ఈ రోజు సాయంత్రం రివ్యూ ఉండాలి. పఠనోత్సవం, లేఖనోత్సవం వంటి కార్యక్రమాలు పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలి” అని కలెక్టర్ పేర్కొన్నారు.విద్యార్థులకు బాలసాహిత్య పాఠాలు బోధించి, రోజూ ఒక పేజీ రాయడం, ఇంగ్లీషు పదాలు వ్రాయడం అలవాటు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
సదుపాయాల పరిశీలన తప్పనిసరి
నవంబర్ 1 నుండి 15 వరకు కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు తమ పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేయాలని ఆదేశించారు.టాయిలెట్స్, తాగునీరు, విద్యుత్, మధ్యాహ్న భోజనం సదుపాయాలను పరిశీలించి లోపాలపై నివేదిక ఇవ్వాలని సూచించారు.బోధనా సామర్థ్యం తక్కువగా ఉన్న ఉపాధ్యాయులను గుర్తించి వారికి నోటీసులు లేదా మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.
మోటివేషన్ క్లాసులు – శతశాతం ఫలితాల లక్ష్యం
9వ, 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ లెక్చర్లను ఏర్పాటు చేసి ప్రోత్సాహం కల్పించాలని కలెక్టర్ సూచించారు.ప్రతి మండలంలో ఒక పాఠశాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలని సూచించారు.“రాబోయే పదవ తరగతి వార్షిక పరీక్షల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడం లక్ష్యంగా పెట్టుకోవాలి” అని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.ఈ సమావేశానికి డిఈఓ అశోక్, కోఆర్డినేటర్లు శ్రావణ్, జనార్ధన్, రాంబాబు, పూలమ్మ తదితరులు హాజరయ్యారు.
