నేరేడుచర్ల, మే 29,శుభోదయ డైనమిక్ వార్త
గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నేరేడుచర్ల మండల కేంద్రంలో పోలీసులు శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఎస్సై సైదిరెడ్డి ఆధ్వర్యంలో డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’ సహాయంతో ప్రత్యేక సోదాలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్సై సైదిరెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రంలోని హోటళ్లు, టీ దుకాణాలు, మెడికల్ షాపులు, కూరగాయల మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటమే ఈ ప్రత్యేక డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న మాదకద్రవ్యాలు
ప్రస్తుత సమాజంలో గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, వాటి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
ప్రజల సహకారం అవసరం
ఎవరైనా గంజాయి వినియోగం లేదా సరఫరాలో పాల్గొంటున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్సై సైదిరెడ్డి తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.



