నేరేడుచర్ల, మే 27,శుభోదయ డైనమిక్ వార్త
బక్రీద్ పండుగ సందర్భంగా గోవులు, పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎస్ఐ సైదిరెడ్డి ఆధ్వర్యంలో నేరేడుచర్ల పోలీసులు విస్తృతంగా కట్టడి ముట్టడి, నాకాబంది తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు చిల్లపల్లి బ్రిడ్జ్ వద్ద ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.
ప్రతి వాహనంపై క్షుణ్ణ పరిశీలన
తనిఖీల్లో భాగంగా ప్రతి వాహనాన్ని ఆపి పూర్తిస్థాయిలో తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. పశువుల అక్రమ రవాణాతో పాటు పేలుడు పదార్థాలు, మారణాయుధాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు.
అనుమానితుల కదలికలపై నిఘా
అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తించడం లక్ష్యంగా ఈ కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. గతంలో గంజాయి రవాణాలో పాల్గొన్న వ్యక్తుల సంచారంపై కూడా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించవద్దని హెచ్చరిక
గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించరాదని వాహనదారులకు పోలీసులు సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నామని ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు.
