డైనమిక్ న్యూస్, ఏప్రిల్ 02, టేక్మాల్
జనగణన మొదటి విడతలో భాగంగా చేపట్టే ఇండ్ల గణన ప్రక్రియకు సంబంధించి బ్లాకుల రూపకల్పనను అత్యంత పటిష్టంగా, పకడ్బందీగా చేపట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం టేక్మాల్ మండల కేంద్రంలో నిర్వహణ ఏర్పాట్లను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పొరపాట్లకు తావు లేకుండా చర్యలు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మే 11 నుండి జూన్ 09 వరకు జరగనున్న ఇండ్ల గణనలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకూడదని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
బ్లాకుల రూపకల్పనపై స్పష్టమైన మార్గదర్శకాలు
ప్రతి రెవెన్యూ గ్రామాన్ని ఒక యూనిట్గా పరిగణించాలి ఒక్కో బ్లాక్లో గరిష్టంగా 300 ఇండ్లు లేదా 800 మంది జనాభా మాత్రమే ఉండేలా చూడాలి
డిజిటలైజేషన్పై ప్రత్యేక దృష్టి
గణన బ్లాకులను సీఎంఎంఎస్ పోర్టల్ ద్వారానే రూపొందించాలని, సాంకేతిక లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోర్టల్ నిర్వహణలో తహసిల్దార్లు వ్యక్తిగత శ్రద్ధ వహించి పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్, ఎంపీడీవోలు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
