నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, మార్చి 25
నేరేడుచర్ల మండలంలో “చలో హైదరాబాద్” కార్యక్రమానికి వెళ్తున్నారనే సమాచారం మేరకు బి ఆర్ ఎస్, బి ఆర్ ఎస్ వీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.
నిరసన హక్కును అణచివేస్తున్నారన్న విమర్శ
ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ వి హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు, కల్లూరు మాజీ సర్పంచ్ పల్లెపంగు నాగరాజు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కును అణచివేయడం సరైంది కాదన్నారు.
ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
నిరుద్యోగ సమస్యలపై ఆగ్రహం
రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం, జాబ్ క్యాలెండర్ లేకపోవడం, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా వంటి హామీలు బడ్జెట్లో కనిపించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
పోరాటం కొనసాగుతుందని హెచ్చరిక
ప్రస్తుత పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బి ఆర్ ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని నాగరాజు హెచ్చరించారు.
అరెస్టైన నాయకులు
ఈ సందర్భంగా హుజూర్నగర్ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు లావుడ్య శ్రీను నాయక్, బి ఆర్ ఎస్ వి ఉపాధ్యక్షుడు జింకల భాస్కర్, నేరేడుచర్ల పట్టణ ఉపాధ్యక్షుడు చిట్యాల శ్రీను, సోషల్ మీడియా నాయకుడు సతీష్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
