డైనమిక్ న్యూస్,వినుకొండ, జనవరి 29
గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక భావజాలాన్ని బలోపేతం చేయడం ద్వారా సమాజంలో శాంతి, సౌహార్ద్రత, సౌభ్రాతృత్వం మరింత విస్తరిస్తాయని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గం, బొల్లపల్లి మండలం పేరూరుపాడు గ్రామంలో గురువారం శ్రీ నాగ మునీంద్ర స్వామి తిరుణాల మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జీవీ ఆంజనేయులు ముందుగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యత
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న ఆధునికీకరణ, అభివృద్ధి పనులను జీవీ లాంఛనంగా ప్రారంభించారు. మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురాతన ఆలయాల పునరుద్ధరణకు, వాటి చారిత్రక వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. పేరూరుపాడు శ్రీ నాగ మునీంద్ర స్వామి ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో భక్తి, ఆధ్యాత్మిక చింతన పెరిగితే యువత సన్మార్గంలో నడుస్తుందని, తద్వారా సమాజంలో మంచితనం పెరుగుతుందని జీవీ ఆంజనేయులు తెలిపారు. దేవాలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా, సామాజిక ఐక్యతకు కేంద్రాలుగా మారాలని ఆకాంక్షించారు.
భారీగా తరలివచ్చిన భక్తులు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
