వినుకొండ, డైనమిక్ న్యూస్, జనవరి 3
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. శుక్రవారం చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రజా దర్బార్లో 48 అర్జీలు
ప్రజా దర్బార్కు నియోజకవర్గం నుంచి మొత్తం 48 అర్జీలు అందగా, వాటిలో పింఛన్లు, రెవెన్యూ, ఇళ్ల స్థలాలకు సంబంధించినవే అధికంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అర్జీదారుల సమస్యలను స్వయంగా ఓపిగ్గా విన్న చీఫ్ విప్, వాటి పరిష్కారానికి భరోసా కల్పించారు.
అధికారులకు తక్షణ ఆదేశాలు
అర్జీలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో మాట్లాడిన ఆయన, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి వారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆన్లైన్ ద్వారా అర్జీల పరిష్కారం
ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపిస్తూ, త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలు
కూటమి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ త్వరలోనే స్థలాలు కేటాయించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని అన్నారు.
మూడు నెలల్లో కొత్త పెన్షన్లు
మూడు నెలల్లో ప్రభుత్వం నూతన పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు చీఫ్ విప్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
