నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 20
ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. రక్తదానం ద్వారా అనేకమంది ప్రాణాలను కాపాడవచ్చని ఆమె పేర్కొన్నారు.
శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా శనివారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతీక్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
పేదలకు ఉపయోగపడే రక్తసేకరణ
శిబిరంలో సేకరించిన రక్తం అత్యవసర పరిస్థితుల్లో పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను, రక్తదానం చేసిన దాతలను ఆమె అభినందించారు.
పెద్ద సంఖ్యలో రక్తదానం
పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో పాటు ఎస్సైలు సైదాబాబా, సైదులు, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.
ప్రతి సంవత్సరం విశేష స్పందన
కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే రక్తదాన శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
