నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 11
గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎక్కడా తప్పులు, నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు ఆదేశించారు. గురువారం ఆమె కనగల్ మండలంలోని జి. ఎడవెల్లి, ఇస్లాం నగర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు.
పోలింగ్ తర్వాత అసలైన బాధ్యత కౌంటింగ్ దశలోనే
కలెక్టర్ మాట్లాడుతూ, పోలింగ్ విజయవంతంగా ముగిసిన తర్వాత అసలు బాధ్యత కౌంటింగ్ దశలో ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్లో జరిగే ప్రతి చర్య ఎన్నికల పారదర్శకతను ప్రతిబింబిస్తుందని, అందువల్ల ఒక్క చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సహించరాదని స్పష్టం చేశారు.
ఒక అభ్యర్థికి ఒకే ఏజెంట్ అనుమతి
పోలింగ్ అనంతరం కౌంటింగ్ సమయంలో పాటించాల్సిన నిబంధనలు, భద్రతా చర్యలపై అక్కడే సిబ్బందికి ఆమె సూచనలు చేశారు.ఒక అభ్యర్థికి ఒకే ఏజెంట్ మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతించాలన్నారు.
బ్యాలెట్ పరిశీలనలో అత్యంత పారదర్శకత అవసరం
బ్యాలెట్ బాక్సులు, కవర్లు, ఫారములు, స్టేట్మెంట్లు అన్నింటిని పూర్తిగా జాగ్రత్తగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు.చెల్లిన ఓటు – చెల్లని ఓటు నిర్ణయంలో ప్రతి టేబుల్ వద్ద RO, ARO మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలని పేర్కొన్నారు.ఏవైనా అభ్యంతరాలు వచ్చినప్పుడు టేబుల్ సూపర్వైజర్ వెంటనే ROను సంప్రదించి స్పష్టత తీసుకోవాలని, అభ్యంతరం వచ్చిన ఓట్లను ప్రత్యేక కవర్లలో ఉంచి నోటింగ్లు నమోదు చేయాలని సూచించారు.
ఖచ్చితత్వమే లక్ష్యం – వేగం కాదు
“కౌంటింగ్ వేగంగా జరగడం కంటే ఖచ్చితమైన ఫలితాలు రావడం ప్రధాన లక్ష్యం” అని కలెక్టర్ స్పష్టం చేశారు.
సిబ్బంది ఆతురత లేకుండా, శ్రద్ధగా పని చేయాలని ఆమె సూచించారు.అన్ని రిజిస్టర్లు, ఫారమ్లు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే రౌండ్ ఫలితాలను ప్రకటించాలని వివరించారు.ఫలితాలు పూర్తయ్యాకే గెలిచిన అభ్యర్థికి ఫామ్–29 జారీ చేయాలని ఆమె చెప్పారు.
సమీక్షలో ఉన్న అధికారులు
ఈ సందర్శనలో జడ్పీ సీఈవో శ్రీనివాసరావు, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, కనగల్ తహసిల్దార్ పద్మ, ఎంపీడీవో వేద రక్షిత, ఎంపీవో సతీష్ కుమార్ తదితరులు కలెక్టర్తో కలిసి ఉన్నారు.
