సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 7
గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడతలో విధులు నిర్వహించనున్న ఉద్యోగులు ఈ నెల 6 నుంచి 9 వరకు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో సూచించారు.
ఫెసిలిటేషన్ కేంద్రాలకు హాజరు కావాలి
గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు కేటాయించబడిన ఉద్యోగులు సంబంధిత మండల కేంద్రాలలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలకు హాజరై పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలని ఆయన వెల్లడించారు.
ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల ఓటు హక్కును విఘాతం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించిందని తెలిపారు. ఈ నెల 11న జరిగే మొదటి విడత ఎన్నికలకు విధులు నిర్వహించే ఉద్యోగులు ముందుగానే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
మొదటి విడతలో ఎన్నికలు జరిగే మండలాలు
ఆత్మకూరు (ఎస్), జాజిరెడ్డిగూడెం, నాగారం, నూతనకల్, మద్దిరాల, సూర్యాపేట, తిరుమలగిరి మరియు తుంగతుర్తి మండలాలలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు.
తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవాలి
ఈ మండలాలలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు నియమితులైన ఉద్యోగులందరూ ఈ నెల 6 నుంచి 9 వరకు సంబంధిత ఫెసిలిటేషన్ కేంద్రాలలో హాజరై పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ పునరుద్ఘాటించారు.
