సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 19
సూర్యాపేటలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
వయో వృద్ధుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
కలెక్టర్ మాట్లాడుతూ, వయో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం రూపొందించిన చట్టాలు, పథకాలు జిల్లాలో సమర్థంగా అమలవుతున్నాయని తెలిపారు. పెద్దలను సంరక్షించడం ప్రతి కుటుంబ సభ్యుడి నైతిక బాధ్యత అని పేర్కొన్నారు.
సైబర్ మోసాలపై సీనియర్ సిటిజెన్స్ అప్రమత్తంగా ఉండాలి
పెన్షన్ అకౌంట్లను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు వృద్ధులను మోసం చేస్తున్న నేపథ్యంలో, అపరిచితుల ఫోన్ కాల్స్, ఓటీపీ లాంటి అంశాలలో అత్యంత జాగ్రత్త అవసరమని కలెక్టర్ హెచ్చరించారు.
సూర్యాపేటలో కొత్త ఓల్డ్ ఏజ్ హోం – త్వరలో అందుబాటులోకి
జిల్లాలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కొత్త ఓల్డ్ ఏజ్ హోం పూర్తిస్థాయిలో త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. అదేవిధంగా మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.
అత్యవసర వైద్య సేవలు – ఉచితంగా అందుబాటులో
ఆలనా పాలన ద్వారా గుర్తించిన వయో వృద్ధులకు అత్యవసర వైద్య చికిత్స ఉచితంగా అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పీహెచ్సీల ద్వారా బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. డోర్ టు డోర్ ఫీవర్ సర్వే సమయంలో సీనియర్ సిటిజెన్స్ వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.
స్వతంత్ర సమరయోధుల అనుభవాలు యువతకు నిదర్శనాలు
జిల్లాలో గణనీయ సంఖ్యలో స్వతంత్ర సమరయోధులు ఉన్నారని, వారి పాత్ర అభివృద్ధిలో ఎంతో ముఖ్యమని కలెక్టర్ చెప్పారు. వారి జీవితానుభవాలు యువతకు మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు.
సీనియర్ సిటిజెన్స్కు ఘన సన్మానాలు
కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సీనియర్ సిటిజెన్స్ను ఘనంగా సన్మానించారు.జిల్లా అదనపు కలెక్టర్ కే.సీతారామారావు, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీడబ్ల్యూడో నరసింహారావు, డీపీఓ యాదగిరి, డిప్యూటీ డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, డీసీహెచ్ఎస్ వెంకటేశ్వర్లు, సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్.సీతారామయ్య, బోల్లు రాంబాబు, విద్యాసాగర్, హమీద్ ఖాన్, క్రిష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
