సూర్యాపేటబ్యూరో, నవంబర్ 13 , డైనమిక్
జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించడం, ప్రత్యేకించి జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదని రాజ్యసభ సభ్యుడు కేశ్రీ దేవ్ సిన్హా జ్వాల అన్నారు.
‘సర్దార్ @150 యూనిట్ మార్చ్’కు ఘనారంభం
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని, ప్రజల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో, మై భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సహకారంతో గురువారం సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన “సర్దార్ @150 యూనిట్ మార్చ్” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
యువతే దేశ భవిష్యత్తు – కేశ్రీ దేవ్ సిన్హా
అనంతరం సభలో మాట్లాడిన ఆయన, “సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తితో యువత జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి. దేశాభివృద్ధికి యువత ఆలోచనలను ఆచరణలో పెట్టి ముందుకు సాగాలి” అని పిలుపునిచ్చారు.
ప్రమాణ స్వీకారంతో కార్యక్రమం ముగింపు
ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ సమైక్యతకు ప్రమాణం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన యూనిట్ మార్చ్, పి.ఎస్.ఆర్. సెంటర్ మీదుగా సద్దల చెరువు వరకు కొనసాగింది.
అధికారులు, విద్యార్థులు భారీగా పాల్గొనడం
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే.సీతారామారావు, ఆర్డీవో వేణు మాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి వెంకట్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, మహబూబాబాద్ యూత్ కోఆర్డినేటర్ రాజేష్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలతో ఊరేగించారు.
