డైనమిక్, బాపట్ల,నవంబర్ 13
సర్దార్ వల్లభాయ్ పటేల్ త్యాగాలు, నాయకత్వం నేటి యువతకు ప్రేరణగా నిలవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం ఉదయం బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాల నుండి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ఐక్యాతా ర్యాలీకి ఆయన జెండా ఊపి ప్రారంభం చేశారు.
దేశ సమైక్యతకు పటేల్ కృషి మరువలేనిది
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
“ముక్కల ముక్కలుగా ఉన్న దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్” అని పేర్కొన్నారు. భారతదేశపు “ఉక్కు మనిషి”గా పేరుపొందిన పటేల్, స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించడంతో పాటు స్వతంత్ర భారతదేశం యొక్క తొలి హోం మంత్రి, ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారని ఆయన గుర్తుచేశారు.
దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలి
భారతదేశం ఇప్పటికే అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని, ఆ ప్రగతిని వేగవంతం చేయడంలో యువత కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు.”పటేల్ చూపిన మార్గంలో నడవడం ద్వారా దేశ నిర్మాణానికి ప్రతి యువకుడు తోడ్పడాలి” అని పిలుపునిచ్చారు.
ఐక్యాతా ప్రతిజ్ఞలో పాల్గొన్న అధికారులు, విద్యార్థులు
తరువాత జాతీయ ఐక్యాతా ప్రతిజ్ఞ చేయించి, “దేశం యొక్క ఐక్యాతా, సమగ్రత, భద్రత కోసం అంకితభావంతో పనిచేస్తాను” అని అందరితో నినదింపజేశారు.ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, ఉప సంచాలకులు కిరణ్మయి, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, డి.ఎస్.డి.ఓ. శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్ రఘునాధ్ రెడ్డి, పోలీసు అధికారులు, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు.
