సూర్యాపేట బ్యూరో, నవంబర్ 12 డైనమిక్
పాలకీడు మండలాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.బుధవారం ఆయన పాలకీడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
పాలకవీడు మండలంలోని మూసి ఒడ్డు సింగారంలో రూ.1.08 కోట్లతో మూసి ఒడ్డు సింగారం నుండి రోళ్ల వారి గూడెం వరకు బీటీ రోడ్డు,యల్లాపురంలో రూ.3.02 కోట్లతో 33/11 కెవి సబ్స్టేషన్ నిర్మాణం,
బెట్టే తండాలో రూ.3.50 కోట్లతో బెట్టెతండా నుండి శూన్య పహాడ్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
గిరిజన రైతుల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు
ఆ తర్వాత నిర్వహించిన సభలో మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గిరిజనులు అధికంగా నివసించే పాలకీడు మండల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.రూ.400 కోట్ల వ్యయంతో 10,000 ఎకరాలకు సాగునీరు అందించే జవహర్ జానపహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ మరియు బెట్టే తండా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా గిరిజన రైతులకు సాగునీరు అందించి మండలాన్ని సస్యశ్యామలం చేయనున్నట్లు పేర్కొన్నారు.
నూతన సబ్స్టేషన్లతో విద్యుత్ సరఫరా మెరుగుదల
ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వ్యవసాయ, గృహ అవసరాలకు ఎలాంటి అంతరాయం లేకుండా మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కొత్త సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు.
ప్రజల పట్ల కృతజ్ఞత – అభివృద్ధి హామీ
“కష్టకాలంలో పాలకీడు ప్రజలు నాకు అండగా ఉన్నారు. కృతజ్ఞతగా ఈ ప్రాంత ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు, మండలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తాను” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ కే. నరసింహ, ఆర్డీఓ శ్రీనివాసులు, పీఆర్ఈఈ వెంకటయ్య, టీఎస్ఎస్పీడీసీఎల్ డీఈ వెంకట కిష్టయ్య, తహసీల్దార్ కమలాకర్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
