సూర్యాపేట బ్యూరో, నవంబర్ 12, డైనమిక్
ప్రజల మేలు కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గరిడేపల్లి మండలంలోని పలు రోడ్ల నిర్మాణాలకు ఆయన బుధవారం శంకుస్థాపనలు చేశారు.
పేదల కోసం సంక్షేమ పథకాల అమలు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ –
“ప్రజా ప్రభుత్వం పేదవారి కడుపు నిండా తినేలా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అర్హత ఉన్న వారికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందజేస్తున్నాం. త్వరలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నాం” అని తెలిపారు.
గరిడేపల్లిలో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు
మంత్రి గడ్డిపల్లి గ్రామంలో 8.28 కోట్లతో బీటీ డబుల్ రోడ్డు,పొనుగోడు గ్రామంలో 50 లక్షలతో 700 మీటర్ల రోడ్డు, పొనుగోడు అప్పన్నపేట మధ్య 3.15 కోట్లతో 4.5 కి.మీ. రోడ్డు,మల్లయ్యగూడెం నుండి పాత నేరేడుచర్ల వరకు 70 లక్షలతో రోడ్డునిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు.తరువాత గరిడేపల్లి నుండి అలింగాపురం వరకు 15.5 కి.మీ. దూరంలో 30 కోట్లతో డబుల్ బీటీ రోడ్డును ప్రారంభించారు.
“రోడ్లను సంరక్షించడం ప్రజల బాధ్యత”: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మంత్రి మాట్లాడుతూ –“ఈ రోడ్డు ప్రతి కిలోమీటరుకు రెండు కోట్ల వ్యయంతో అత్యుత్తమ నాణ్యతతో నిర్మించాం. రైతులు ట్రాక్టర్లు, భారీ వాహనాలు నిర్లక్ష్యంగా నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్ల సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి” అని పేర్కొన్నారు.
గరిడేపల్లి మండల అభివృద్ధిలో ముందుకు
గరిడేపల్లి మండలంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.గడ్డిపల్లిలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారి, పలు రోడ్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు.హుజూర్నగర్లో 7.5 కోట్లతో జూనియర్ కాలేజీ, 4.5 కోట్లతో డిగ్రీ కాలేజీ, 100 పడకల ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్, సీటీస్కాన్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.“విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు, సాగు ఇలా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి హుజూర్నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాను” అని మంత్రి అన్నారు.
ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం
పొనుగోడు చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి చేప పిల్లలను చెరువులో విడదల చేశారు.


కార్యక్రమంలో పాల్గొన్న వారు
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే. నరసింహ, ఆర్డీఓ శ్రీనివాసులు, ఆర్అండ్బీ ఈఈ సీతారామయ్య, పీఆర్ ఈఈ వెంకటయ్య, డి.ఈ. రమేష్, మత్స్యశాఖ అధికారి నాగులు నాయక్, తహసీల్దార్ కవిత, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
