సూర్యాపేట బ్యూరో, డైనమిక్,నవంబర్12
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ధాన్యం తేమ శాతం, కొలతలు, కొనుగోలు విధానాన్ని స్వయంగా పరిశీలించి అన్నదాతలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఒకే సీజన్లో 150 లక్షల మెట్రిక్ టన్నుల పంట – చరిత్ర సృష్టించిన తెలంగాణ
స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక్క సీజన్లో 150 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు.ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.25 వేల కోట్లతో కొనుగోలు చేయడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
రైతుల ఖాతాల్లో 72 గంటల్లో చెల్లింపులు
ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం తేమ శాతం 17 శాతానికి చేరగానే ధాన్యం కొనుగోలు జరుగుతోందని,కొనుగోలు అనంతరం 48 నుండి 72 గంటల్లో రైతుల అకౌంట్లలో మద్దతు ధరతో పాటు బోనస్ జమ అవుతుందని తెలిపారు.
తడిచిన ధాన్యాన్నీ మద్దతు ధరకే కొనుగోలు
మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవడంతో ధాన్యం తడిచిందని,
రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తడిచిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
రైతుల సౌకర్యం కోసం అన్ని వసతులు
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు వంటి వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు.
రైతులు ప్రభుత్వ కేంద్రాల ద్వారానే ధాన్యం విక్రయించి రూ.500 బోనస్తో పాటు మద్దతు ధరను పొందాలని ఆయన కోరారు.
అధికారులతో సమీక్ష
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే. నరసింహ,ఆర్డీవో శ్రీనివాసులు, డి.ఎస్.ఓ మోహన్ బాబు, డిఎం రాము, తహసిల్దార్ కవిత,
స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


