గరిడేపల్లి, నవంబర్ 9 ,డైనమిక్
వానాకాలం సీజన్లో పశువులకు వివిధ రకాల సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని గోపాలమిత్రలు గోపి, శేఖర్లు సూచించారు.
ముందస్తు చర్యలతో వ్యాధి నిరోధం
గానుబండ గ్రామంలో ఆదివారం పశువులకు ముందస్తుగా టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలమిత్రులు మాట్లాడుతూ — ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా పశువులకు టీకాలు వేయిస్తున్నదని తెలిపారు. నాలుగు నెలల వయస్సు దాటిన గేదెలకు ఈ టీకాలు వేయడం జరుగుతుందని, దీని వలన పశువులలో రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని వివరించారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
పాడి రైతులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పశువుల ఆరోగ్యం బాగుంటేనే పాలు ఉత్పత్తి మెరుగు పడుతుందని, ఆర్థికంగా రైతులకు లాభదాయ కమవుతుందని గోపాలమిత్రులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోకల ఆంజనేయులు, పంగ గోవిందు, శీలం గురవయ్య, జానపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
