నల్లగొండ బ్యూరో, డైనమిక్,నవంబర్2
2027 జనగణన కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండలంలో నిర్వహించనున్న ముందస్తు గణన కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను ఆదేశించారు.ఆదివారం తిప్పర్తి రైతు వేదికలో ప్రారంభమైన మూడు రోజుల శిక్షణా కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. ఈ శిబిరంలో పాల్గొంటున్న 35 మంది ఎన్యుమరేటర్లు, 6 మంది సూపర్వైజర్లు గణన విధానాలపై అవగాహన పొందుతున్నారు.
రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు ఎంపిక
2027 జనగణనను డిజిటల్ పద్ధతిలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్గా మూడు ప్రాంతాలను ఎంపిక చేసింది.పట్టణ ప్రాంతం: జిహెచ్ఎంసి పరిధి గ్రామీణ ప్రాంతం: నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం గిరిజన ప్రాంతం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ప్రాజెక్ట్లో భాగంగా తిప్పర్తి మండలంలోని మామిడాల, ఇండ్లూరు, సర్వారం, తిప్పర్తి, జంగారెడ్డిగూడెం గ్రామాల్లో జనగణన జరగనుంది.
డిజిటల్ విధానంలో ఖచ్చితమైన లెక్కలు
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ —
“మొదటిసారిగా జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలి. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే రాష్ట్ర స్థాయిలో సత్వర పరిష్కారం సాధించవచ్చు,” అని తెలిపారు.
కార్యక్రమ షెడ్యూల్
నవంబర్ 10 నుండి 15 వరకు: ఇండ్ల మ్యాపింగ్ (మొబైల్ యాప్ ద్వారా)నవంబర్ 15 నుండి 30 వరకు: ఇంటింటి సర్వే – డిజిటల్ ప్రొఫార్మా ద్వారా జనాభా లెక్కల సేకరణ
పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రాష్ట్ర గణాంక శాఖ జెడి లాజరస్, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, తహసీల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



