డైనమిక్ న్యూస్, హుజూర్నగర్, జనవరి 28
హుజూర్నగర్ పట్టణంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణంలోని రామస్వామి గట్టు ప్రాంతంలో గంజాయి విక్రయం జరుగుతున్నట్లు అందిన నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
నమ్మదగిన సమాచారంతో దాడులు
అందిన సమాచారం ఆధారంగా ఎస్సై మోహన్బాబు, సిబ్బందితో కలిసి రామస్వామి గట్టుకు వెళ్లి మంగళవారం మాటు వేశారు. అక్కడ గంజాయి విక్రయానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అరెస్ట్ అయిన నిందితులు
ఈ కేసులో వీరమల్ల ఉపేందర్, కాస జయంత్ కెన్ని, సాముల ప్రతాప్రెడ్డి, చిల్ల వికాస్, సయ్యద్ రహమద్ బాబా, జడలింగస్వామి, దగడ్ సాయి తదితరులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హుజూర్నగర్ పట్టణానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు.
ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు
ప్రధాన నిందితుడైన వీరమల్ల ఉపేందర్ తన మోటార్సైకిల్ను హైదరాబాద్లో రూ.20,000కు విక్రయించి, ఆ డబ్బులతో ఒడిశా రాష్ట్రానికి వెళ్లి 6 కేజీల గంజాయిని కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఉపేందర్, కాస జయంత్ కలిసి గంజాయిని హుజూర్నగర్కు తీసుకొచ్చి విక్రయానికి ప్రయత్నించగా మిగిలిన వారు కొనుగోలు కోసం అక్కడికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసిన సామగ్రి
నిందితుల నుంచి 6 కేజీల గంజాయి, ఒక బైక్, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపర్చినట్లు సీఐ చరమందరాజు తెలిపారు.
డ్రగ్స్పై కఠిన చర్యలు
పట్టణంలో మత్తుపదార్థాల అక్రమ వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు కొనసాగిస్తామని సీఐ స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇలాంటి సమాచారం పోలీసులకు వెంటనే అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు మోహన్బాబు, నరేష్, ఏఎస్ఐ బలరాం రెడ్డితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
